రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్”. మైథలాజికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 16న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఐతే, ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి భద్రత కోసం వెయ్యి మంది పోలీసులను కేటాయించినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సుమారు 2నుంచి 3లక్షల మంది వరకు అభిమానులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
కార్యక్రమం జరిగే మంగళవారం రోజు తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. భారీ స్థాయిలో హాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.