అఖండతో బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర చేశాడు. బాలయ్య ‘అఖండ’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ ను, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాల వారిని కూడా ఆశ్చర్యపరిచింది. అయితే, ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అట.
అయితే, ఓటీటీలో తమ సినిమాకు భారీ వ్యూస్ రావడంతో బాలయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన మా ‘అఖండ’ చిత్రం.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఓటీటీ వేదిక ద్వారా మా చిత్రం మరింత మంది వీక్షించడం ఆనందాన్ని కలిగించింది’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.
పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యూఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధించింది. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన మరియు భారీ కలెక్షన్స్ రావడం విశేషం. ‘ద్వారకా క్రియేషన్స్’ మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.