తుదిశ్వాస వరకు కమెడియన్ గానే ఉంటా – డాక్టర్ బ్రహ్మానందం

తుదిశ్వాస వరకు కమెడియన్ గానే ఉంటా – డాక్టర్ బ్రహ్మానందం

Published on Mar 21, 2023 9:00 PM IST

తెలుగు సినీ తెరపై ఒక్కసారి కమెడియన్ బ్రహ్మానందం అలా కనిపిస్తే చాలు, స్టార్ నటీనటులకు ధీటుగా ఆయన సీన్స్ కు అప్లాజ్ వస్తుంటుంది. ఆ విధంగా మొదటి నుండి తెలుగు ఆడియన్స్ ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. అయితే తన కెరీర్ లో తొలిసారిగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్ చేస్తున్నారు బ్రహ్మానందం. ఇప్పటికే రంగమార్తాండ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. రేపు ఉగాది సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

కాగా నేడు యూనిట్ ప్రత్యేకంగా మీడియాతో సినిమా అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కమెడియన్ పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈ సినిమాలోని తన పాత్ర కెరీర్ మొత్తంలో ఎంతో వైవిధ్యమైనదని అన్నారు. అలానే ఇది ఒక ఛాలెంజింగ్ పాత్ర అని, ఇటువంటి పాత్రని బ్రహ్మానందం కి ఇచ్చి కృష్ణవంశీ చెడగొట్టారు అనే చెడ్డపేరు రాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా నటించానని అన్నారు. ప్రకాష్ రాజ్ ఒకరోజు ఫోన్ చేసి అన్నయ్య మీరు ఈరోజు ఎంతో అద్బుతంగా నటించారు అని అన్నారు.

ఈరోజు మిమ్మల్ని అభినందించకపోతే కళామతల్లికి ద్రోహం చేసినట్లే అంటూ ఆయన అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ప్రకాష్ రాజ్ వంటి గొప్ప నటుడు ఎక్కడైనా నేను కనపడితే బాగా నటించారు అని మాములుగా చెప్పవచ్చు కానీ, ఫోన్ చేసి అభినందించడం మాములు విషయం కాదన్నారు. ఇక రంగమార్తాండ లోని ప్రతి సన్నివేశం, ప్రతి పాత్రధారి తప్పకుండా మన ఆడియన్స్ మనసుని కదిలించడంతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఆ విధంగా అత్యద్భుతంగా కృష్ణవంశీ దీనిని చిత్రీకరించారని, తప్పకుండా మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఇక తన సినీ కెరీర్ లో తుదిశ్వాస వరకు ఆడియన్స్ ని నవ్విస్తూ కమెడియన్ గా అందరికీ నవ్వులు పంచుతూనే ఉంటానని తెలిపారు బ్రహ్మానందం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు