బాలీవుడ్ నటి కంగనా రనౌత్, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం పై ఓ ఇంటర్వ్యూలో హీరో హృతిక్ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్ లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కామెంట్స్ చేసింది. అయితే కంగనా కామెంట్స్ పై జావెద్ అక్తర్ పరువు నష్టం కేసు వేయడం జరిగింది.
కాగా ఈ కేసులో ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనాను తమ ముందు హాజరుకావాలంటూ పలుమార్లు సమన్లు జారీచేసినా ఆమె హాజరు కాలేదు. అయితే కోర్టు ఒత్తిడితో ఎట్టకేలకు కంగనా కోర్టుకు వెళ్లారు. ఇక కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమె కోర్టు పై కూడా పలు ఆరోపణలు చేశారు.
‘బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే అంటూ.. లేదంటే వారెంట్ జారీచేస్తామంటూ కోర్టు రెండుసార్లు తనను పరోక్షంగా బెదిరించిందని కంగనా చెప్పుకొచ్చింది. కేసు దర్యాప్తు తనకు వ్యతిరేకంగా సాగుతోందని అని కూడా ఆమె తెలియజేసింది.