దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్కు అరుదైన గౌరవం దక్కింది. నటుడిగానే కాకుండా ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డు ‘కర్ణాటక రత్న’ను ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోగా ఆరంగేట్రం చేసిన పునీత్ రాజ్ కుమార్ అతి తక్కువ సమయంలోనే కన్నడ పవర్ స్టార్గా ఎదిగాడు. నటుడిగా అలరిస్తూనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కన్నడీగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. విధి వక్రీకరించిందో ఏమో తెలీదు కానీ గుండె పోటుతో అక్టోబర్ 29న పునీత్ రాజ్కుమార్ తుది శ్వాస విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. అయితే పునీత్ చేసిన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ అవార్డును ప్రకటించినందుకు పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.