తెలుగు పరిశ్రమలో మొదలైన కాస్టింగ్ కౌచ్ దుమారం సద్దుమణగక ముందే తాజాగా అమెరికాలో వెలుగు చూసిన చీకటి వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు మోదుగుమూడి కిషన్, మోదుగుమూడి చంద్రకళలను అక్కడి స్థానిక అధికారులు అరెస్ట్ చేసి, విచారణ జరిపి ఈ గురువారం ఇల్లినాయిస్ వ్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. గురువారం జరగబోయే విచారణ తరవాత ఒక్క నెలలోనే కేసు మొత్తం పూర్తవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
అసలు ఈ రాకెట్ గుట్టు ఎలా రట్టైందనే విషయం తెలిస్తే కొంత ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ముందుగా మోదుగుమూడి దంపతులకు వీసా గడువు పూర్తైనా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారనే నేరం మీద అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఇంట్లో సోదాలు జరపగా లభ్యమైన అనేక పత్రాల్లో ఒక ప్రముఖ హోటల్ కు సంబందించిన పేపర్ ఒకటి దొరికిందట. దానిపై సినీ తారల పేర్లు వాటి పక్కన తేదీలు, హోటల్ రూమ్ నంబర్లు వరుస క్రమంలో వేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆ రాతలు వెనుక ఏదో పెద్ద తతంగమే ఉందని అనుమానించి విచారణ జరపగా ఈ సినీ తారల వ్యవహారం బయటపడింది.
దాంతో సమగ్ర విచారణలో భాగంగా కిషన్ ఇంట్లో ఇంకోసారి సోదాలు జరపగా డబ్బు లావాదేవీలకు సంబందించి ఒక డైరీ లభ్యమైంది. అంతేగాక కిషన్ దంపతులు తెలుగు సంఘాల పేర్లతో నకిలీ లేఖలను సృష్టించి సినీ తారలను అమెరికా రప్పించి ఈ ఊబిలోకి లాగుతున్నట్టు కనుగొన్నారు. ఈ సాక్ష్యాల ఆధారంగా విటులను, నటీమణులను విచారించి 42 పేజీల నేర పిర్యాధును తయారుచేశారు పోలీసులు. దీన్ని ఈ గురువారం కోర్టులో సమర్పించనున్నారు. తొలిదశ విచారణలోనే కొంతమంది సినీ తరాలు, వ్యక్తుల పేర్లు బయటపడగా వాయిదా అనంతరం జరపబోయే తుది విచారణలో పూర్తి పేర్లు బయటపడనున్నాయి.
ఈ వ్యవహారంతో ఇన్నాళ్లు సినిమా చిత్రీకరణలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల కోసం తరచూ అమెరికా వెళ్లే సినీ తారల్లో ఒకింత అయోమయం నెలకొంది. ఈ రాకెట్ కారణంగా ఇటీవల అమెరికా ప్రయాణంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ను సైతం అక్కడి పోలీసులు అరగంట సేపు విచారించి ఆమెకు ఆ రాకెట్ తో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్న తర్వాత ప్రయాణానికి అనుమతిచ్చినట్టు సమాచారం.
