మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న(ఆదివారం) ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి పాల్గొని చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఓ రాజకీయ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్తో లైలా మూవీని బాయ్కాట్ చేయాలనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
దీంతో ఈ ఇష్యూపై తాజాగా లైలా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించిన తమ స్పందన తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి పాల్గొని మాట్లాడారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘మా ఈవెంట్లో జరిగిన దానికి సారీ చెబుతున్నాను. సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా.. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే ఎలా.. సినిమా బ్రతకాలా లేదా.. మేము చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు.. మా కంట్రోల్లో జరుగలేదు. చాలా కష్టపడి సినిమా తీశాము.. నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు.’’ అంటూ తన వివరణ ఇచ్చారు.
ఇక నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ‘ బాయికాట్ లైలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి షాక్కి గురయ్యాము. అది మా నోటీస్లో జరుగలేదు. సినిమాని అందరూ సినిమాగా చూడండి. గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు.’ అని తెలిపారు. ఇలా పృథ్వీ చేసిన కామెంట్స్తో తమ సినిమాకు డ్యామేజ్ చేయొద్దంటూ వారు ఈ సందర్భంగా కోరారు.