సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే రమేశ్బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా కృష్ణ-ఇందిర దంపతులకు తొలి సంతానంగా జన్మించిన రమేశ్ బాబు అక్టోబర్ 13, 1965 చెన్నైలో జన్మించారు. 1974లో తండ్రి కృష్ణ హీరోగా నటించిన “అల్లూరి సీతారామరాజు”లో బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన రమేశ్ బాబు “సామ్రాట్” సినిమాతో హీరోగా మారారు. కృష్ణ, మహేశ్ బాబుతో కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్ బాబు 2004లో నిర్మాతగా మారారు. మహేశ్ బాబు అర్జున్, అతిధి సినిమాలకు నిర్మాతగా పనిచేశారు.