విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మా అధ్యక్షుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బిఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు. యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (05), దర్శిని (02)లను తన స్వంత బిడ్డలలా సంరక్షిస్తానని, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో వారికి పూర్తి ఉచితంగా చదువు, హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామి ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు.