ఏ సినిమాకు ఇంత ఇన్ స్పైర్ కాలేదు – నాగచైతన్య

ఏ సినిమాకు ఇంత ఇన్ స్పైర్ కాలేదు – నాగచైతన్య

Published on Sep 19, 2021 11:00 PM IST

అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న ఫీల్ గుడ్ సినిమా “లవ్ స్టోరి”. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాంతో చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ….మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా పాండమిక్ టైమ్ లో ఎంతోమంది కార్మికులకు సాయం చేశారు. మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ ఇన్ స్పైరింగ్ గా ఉంది. లవ్ స్టోరి ట్రైలర్ చూసి అమీర్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. సండే ఏంటి ప్రోగ్రాం అని ఆయన అడగగానే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను. నేను వస్తాను అన్నారు. ఆయన ఆ మాట అనగానే నమ్మలేకపోయాను. 45 రోజులు లాల్ సింగ్ చద్దా సినిమా కోసం అమీర్ ఖాన్ గారితో పనిచేశాను. ఆ టైమ్ లో నేను మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా అభిమానులను మిస్ అవుతున్నానని తెలుసు. కానీ పాండమిక్ పరిస్థితుల వల్ల కొంతమంది అభిమానులనే కలవగలుగుతున్నాను. లవ్ స్టోరి విషయానికి వస్తే, నేను ఇప్పటిదాకా ఏ సినిమాకూ ఇంత ఇన్ స్పైర్ కాలేదు, ఏ క్యారెక్టర్ ఇంత డెప్త్ లోకి వెళ్లి చేయలేదు. శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఇంత ఇన్ వాల్వ్ అయి లవ్ స్టోరి చిత్రంలో నటించగలిగాను.

శేఖర్ గారి దర్శకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆయన కథ లో, క్యారెక్టర్ లో వెళ్లే డెప్త్ చూసి, ఈ మనిషి కోసం ఎంత దూరం అయినా వెళ్లొచ్చు అనిపించింది. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన హీరోలకు ఎప్పుడూ చెబుతుంటాను, దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో అవకాశం వస్తే సినిమా వదులుకోకండి. ఆయనతో సినిమా చేశాక మంచి నటుడు అవుతారు, మంచి పర్సన్ అవుతారు, నేనూ అలాగే మారాను. మీరు ఏదీ నేర్పించలేదు. మేమే నేర్చుకున్నాం. ఒకట్రెండు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరిలో చెప్పబోతున్నారు. అవి 24న థియేటర్ లో చూస్తారు. ఇలాంటి సినిమాలో నటించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక సెన్సిటివ్ ఇష్యూను గురించి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. మా దర్శకుడికి ఆ ధైర్యం ఉంది. ఏడాది ఏడాదిన్నరగా సినిమాను హోల్డ్ చేసిన నిర్మాతలకు థాంక్స్. మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. సాయి పల్లవి ఆన్ స్క్రీన్ నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. 24న మా సినిమా విడుదల అవుతోంది. ఇదో మ్యాజిక్ డేట్ లా అనిపిస్తోంది. తాతగారి ప్రేమనగర్ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. మిమ్మల్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు