నన్ను, బోయపాటిని ఆ దేవదేవుడే కలిపాడు – నందమూరి బాలకృష్ణ

నన్ను, బోయపాటిని ఆ దేవదేవుడే కలిపాడు – నందమూరి బాలకృష్ణ

Published on Jan 21, 2022 2:04 AM IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భగా హైదరాబాద్‌లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ వేదికగా ‘అఖండ’ చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. అయితే ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే బాలకృష్ణ విచ్చేసి అభిమానులను అలరించారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌కి వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. స్టూడియోలో నాన్నగారికోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. మరోవైపు సమరసింహారెడ్డి శతదినోత్స వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. చిత్ర విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడని అన్నారు.

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా వుంది. ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు. ఫైనల్‌గా అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంతో పెద్ద ఘనవిజయాన్ని అందించారని అదేవిధంగా రేపు సాయంత్రం 6గంటల నుంచి డిస్నీప్లస్ హార్ట్ స్టార్‌లో కూడా చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ జై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తించాడు. సోదర సమానులైన నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అలాగే అభిమానుల అండతో తెలుగు ప్రేక్షకుల అండదండలతో బాలయ్యబాబు నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకూ అఖండ విజయం సాధించి పెట్టింది. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం నందమూరి అబిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమది. ఈ విజయాన్ని ఎన్.టి.ఆర్.గారికి అంకితమిస్తూ, మా కాంబినేషన్ ఎప్పడు తీసినా మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా ఉంటుంది. నిజాయితీగా చెబుతున్నా ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం ఉండాలంటూ జై బాలయ్య అంటూ ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు