విషాదం : నందమూరి తారకరత్న మృతి

నందమూరి తారకరామారావు గారి మనవడు నందమూరి తారకరత్న ఇటీవల నారాలోకేష్ కుప్పం నుండి చేపట్టిన యువగళం మొదటి రోజు పాదయాత్రలో స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అదేసమయంలో స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు గుండెనొప్పి వచ్చినట్లు తేల్చారు. అనంతరం తారకరత్నని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే గత జనవరి 27న అదే ఆసుపత్రిలో చేరిన తారకరత్నకు అప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా పలువురు నిపుణులైన వైద్యులు మెరుగైన చికిత్సని అందిస్తున్నారు.

కాగా నేడు సాయంత్రం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో తాము ఎంత ప్రయత్నించినా వీలుకాలేదని, కాగా కొద్దిసేపటి క్రితం తారకరత్న మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. ఇక ఈ విషయం తెల్సుకున్న పలువురు నందమూరి కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా తారకరత్న అకాల మరణంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళి అర్పిస్తున్నారు.

Exit mobile version