ఈ నెలలో విడుదలైన అఖండ, పుష్ప వంటి భారీ బడ్జెట్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కలెక్షన్లను దండుకుంటున్నాయి. అయితే ఈ వారం కూడా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మరియు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.అవేంటో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే సినిమాలు:
1) నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2) సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.ఎం.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడుపుఠాణి’. పరుపాటి శ్రీనివాస్రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
3) పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్’. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
4) 2019లో తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసు ఎన్కౌంటర్ నేపధ్యంలో ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు:
1) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోని లివ్లో డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
2) యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “వరుడు కావలెను”. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమ ‘జీ5’ ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.