‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్, మలయాళంలోనూ పలు సినిమాలు చేసిన ఈ భామ 2013లో ముంబైకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ తెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది.
విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఓ వెబ్సిరీస్ రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ నిర్మించనుందని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కానీ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకొచ్చింది ఈ వెబ్ సిరీస్లో కీలక పాత్ర కోసం దర్శకనిర్మాతలు నిషా అగర్వాల్ను సంప్రదించారని, దానికి ఆమె కూడా ఒకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.