నటకిరీటి, పద్మశ్రీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పూర్తిస్థాయి హాస్య చిత్రం “పాంచాలి పంచభర్తృక”. రోయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ పతాకాలపై రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని “సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట” అనే రెట్రో సాంగ్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకుంది.
చాలా కాలం తర్వాత తనకు ఇలాంటి అరుదైన పాత్ర దక్కిందని, ఫైట్లు, పాటలతో పాత రాజేంద్రప్రసాద్ను ఈ సినిమాలో చూస్తారని ఆయన అన్నారు. తొలిసారి హీరోగా నటిస్తున్న ప్రముఖ ర్యాపర్ రోల్ రైడా మాట్లాడుతూ.. ఇది ప్రేక్షకులకు మంచి ఫన్ ట్రీట్ అని, ఆద్యంతం నవ్విస్తుందని చెప్పారు. తెలుగు తెరపై ఆరోగ్యకరమైన హాస్యం చూసి చాలా రోజులైందని, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో నటించడం సవాల్గా అనిపించిందని మరో నటుడు జెమినీ సురేష్ పేర్కొన్నారు. సెటిల్డ్ కామెడీతో మెప్పించడం కొత్త నటుడిగా తనకు ఒక పరీక్ష అని, సహ నిర్మాతలు శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యంల సహకారంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమాను నిర్మించామని హీరో కమ్ ప్రొడ్యూసర్ రాజ్ పవన్ తెలిపారు.
నెల్లూరు యాసలో నటించడం తనలోని అసలైన నటుడిని బయటకు తీసుకువచ్చిందని మరో నిర్మాత, నటుడు వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ అన్నారు. రచయిత బాబీ అందించిన బలమైన కథను హాస్యంతో చెప్పామని, ఇందులోని డైలాగ్స్ కచ్చితంగా ట్రెండ్ అవుతాయని దర్శకుడు గంగ సప్తశిఖర ధీమా వ్యక్తం చేశారు.
