మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్లు హీరో హీరోయిన్లుగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. అయితే కొద్ది రోజుల క్రితం సాయి తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా నిలకడగానే ఉందని, ప్రస్తుతం ఇంకా కళ్లు తెరవలేదని అన్నారు. సాయి తేజ్ ఆక్సిడెంట్ విషయంలో లేనిపోని కథనాలు అల్లారని, ఇసుక మేట కారణంగానే సాయి తేజ్ బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడని అన్నారు. మేము కూడా మనుషులమే కదా, మాపై కొంచెం కనికరం చూపించండని అన్నారు.
ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది వైసీపీ రిపబ్లిక్ కాదని, ఇండియన్ రిపబ్లిక్ అని అన్నారు. సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవని అన్నారు. నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి కానీ సినిమా ఇండస్ట్రీని మాత్రం వదిలేయండని, దీనిపై ఆధారపడి బ్రతికే వారు చాలా మంది ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని కూడా అన్నారు.
ఇకపోతే రిపబ్లిక్ సినిమాను దేవకట్టా సామాజిక స్పృహతో తీశారని, ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా ఇదని తెలుస్తుందని, ఈ సినిమా కోసం దేవకట్ట గారు ఎంత కృషి చేశారో కనిపిస్తుందని అన్నారు. ఈ సినిమా తేజ్కి మంచి సక్సెస్ ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.