టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ భారీ ప్రాజెక్ట్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ఒక ఈవెంట్లో స్వయంగా వెల్లడించారు.
తాను రాజమౌళి ‘వారణాసి’లో నటిస్తున్నానని.. ఇందులో తాను ఒక పరమ శివ భక్తుడి పాత్రలో కనిపిస్తానంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే, ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో కనిపిస్తారని, కథను మలుపు తిప్పే కీలకమైన అంశం ఆయన పాత్రతోనే ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు మరియు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ గతంలో ‘ఒక్కడు’, ‘దూకుడు’, ‘మహర్షి’ వంటి సినిమాల్లో మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కేవలం అడ్వెంచరర్ ‘రుద్ర’గానే కాకుండా, రామాయణ నేపథ్యమున్న ఒక ప్రత్యేక ఎపిసోడ్లో మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఈ చిత్రాన్ని 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
