భాస్కర్ నీ కథాబలమే కరోనా ను దాటించింది… థాంక్యూ మీట్ లో బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!

భాస్కర్ నీ కథాబలమే కరోనా ను దాటించింది… థాంక్యూ మీట్ లో బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!

Published on Oct 18, 2021 9:16 PM IST


అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాకు సంబంధించిన థాంక్యూ మీట్ వైజాగ్ లో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. సినిమా యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు.

హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, “హలో వైజాగ్ ఇక్కడికి వచ్చిన అభిమానులు అందరికీ ధన్యవాదాలు. మంత్రి అవంతి శ్రీనివాస్ గారికి స్పెషల్ థాంక్స్. 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ సినిమా నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. అదే టీం వర్క్, కథను నమ్మి ఈ సినిమా చేశాము. దాని ఫలితం ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్, వాసు వర్మ, బన్నీ వాసు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అల్లు అరవింద్ గారు మీరు మాకు గాడ్ ఫాదర్. మీ నమ్మకాన్ని నిలబెట్టామనే అనుకుంటున్నాము. పూజా హెగ్డే కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. త్వరలోనే మరోసారి వైజాగ్ వస్తాం. మరో సక్సెస్ మీట్ జరుపుకుందాం. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని తెలిపారు.

నిర్మాత బన్నీ వాసు గారు మాట్లాడుతూ, “హలో వైజాగ్, మాకు వైజాగ్ అంటే ఎప్పుడూ ఇష్టమే. ఇక్కడేం ఫంక్షన్ చేసినా, షూటింగ్ చేసినా సక్సెస్ అవుతుంది. మంత్రి అవంతి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. ఆయన లేకపోతే ఈ వేడుక జరిగేది కాదు. ఈ సినిమా ఎంత మంది విజయం అంటే, చూసిన వాళ్లు మళ్లీ కొత్తగా కాపురం మొదలుపెడదాం అంటున్నారు. ఇదొక్కటి చాలు, మా సినిమా కోసం మేం పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం అని. థియేటర్స్‌లో చాలా మంది భార్యాభర్తలు సినిమా చూస్తున్నపుడు మీ ఆలోచనలు అక్కడే తిరుగుతుంటాయి. భాస్కర్ నీ కథాబలమే కరోనాను దాటించింది. థ్యాంక్ యూ మా బ్యానర్‌కు మంచి హిట్ ఇచ్చావు. ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కుటుంబాలు థియేటర్స్ వైపుకు వస్తున్నాయంటే అది కేవలం కథా బలమే. అఖిల్ గారు నాకు బ్రదర్ అయిపోయారు. 100 పర్సెంట్ లవ్‌తో నాగ చైతన్య గారు హిట్ ఇస్తే, ఇప్పుడు అఖిల్ గారూ పెద్ద హిట్ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులున్నా కూడా మంచి కథ ఉన్న సినిమాలు వస్తే థియేటర్స్‌కు జనం వస్తారని నిరూపించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. మా సినిమాకు ఇంత పెద్ద విజయం అందించినందుకు మరోసారి థ్యాంక్స్” అని తెలిపారు.

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు మాట్లాడుతూ, “అక్టోబర్ 14 వరకు అది నా సినిమా, నా ఐడియా, 15 నుంచి అది మీ సినిమా. మా ఆలోచనను మీరు తీసుకుని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. అల్లు అరవింద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మంత్రి అవంతి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. వాసు వర్మ, బన్నీ వాసు ఈ సినిమా కోసం నిలబడ్డారు. అఖిల్ అక్కినేని ని కొత్తగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసి కాపురాలు కొత్తగా మొదలవుతున్నాయని తెలిసి నవ్వుకున్నాం. ఫ్యామిలీస్ అంతా వచ్చి థియేటర్స్ లో ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ, “బొమ్మరిల్లు సినిమా తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఇప్పుడు బ్యాచ్‌లర్ భాస్కర్ అయిపోతాడేమో తెలియదు మరి. కాకపోతే ఈ సినిమాతో ఎంత మంది కాపురాలకు సమస్యలు తెస్తాడో అనిపిస్తుంది. సినిమాల్లో సాధారణంగా మెసేజ్ ఎక్కదు. కానీ, ఈ సినిమాలో బ్యాచ్‌లర్ అనే టైటిల్ పెట్టి పెళ్లి కాకుండానే కాపురం చూపిస్తారు ఈ చిత్రంలో. అందుకే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే, భార్యా భర్తలు కావాలంటే ఏయే అంశాలు కావాలో ఈ సినిమాలో చూపించారు. భార్యాభర్తలు చూస్తే కచ్చితంగా మొహామొహాలు చూసుకుంటారు. మహిళలు మీ భర్తలను సినిమాకు తీసుకెళ్లండి, మెసేజ్ చూసి ఆనందిస్తారు. అది మా గ్యారెంటీ. చాలా సినిమాలు ఓటిటిలో వచ్చేస్తున్నాయి. కొన్ని నెలల వరకు ఓటిటిలో రావడం లేదు. థియేటర్స్‌కు వెళ్లి చూడాల్సిందే. త్వరలోనే వచ్చేస్తుంది ఓటిటిలో నేను నిన్న చూసాను. కానీ అది నిజం కాదు. చాలా కాలం తర్వాతే ఇది ఓటిటిలో వస్తుంది. పూజా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాసు వర్మ చివరి వరకు అతుక్కునే ఉన్నాడు. వట్టి వసంత్ గారు, గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్లు రావాల్సి ఉంది, కానీ కుదర్లేదు. ఈ సినిమాను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు” అని తెలిపారు.

నిర్మాత వాసు వర్మ మాట్లాడుతూ, “మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మంత్రి అవంతి శ్రీనివాసరావు గారికి థాంక్యూ. ఇది మంచి కుటుంబ కథా చిత్రం అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి చూసినవాళ్లు రెండోసారి కుటుంబాన్ని తీసుకుని వస్తున్నారు. నాకు ప్రొడ్యూసర్ అనే కార్డు ఇచ్చిన అల్లు అరవింద్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వైజాగ్ అంటే మెగా కాంపౌండ్ మాత్రమే కాదు అక్కినేని కాంపౌండ్ కు కూడా బాగా కలిసొస్తుందని ఇక్కడ వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. గీత గోవిందం తర్వాత హీరో హీరోయిన్స్ మధ్య అంత అద్భుతంగా కెమిస్ట్రీ వర్కౌట్ అయిన సినిమా ఇదే అనిపిస్తుంది. అఖిల్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో పూజ హెగ్డే చాలా బాగా నటించింది. మా భాస్కర్ అద్భుతమైన కథ రాసుకున్నాడు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు