రజనీ తదుపరి సినిమా ‘కబాలి’ డైరెక్టర్‌తోనే!

rajinikanth
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తోన్న ‘రోబో 2.0’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇలా సెట్స్‌పై ఉండగానే ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ఆసక్తికర ప్రకటన ఒకటి ఇప్పుడే వెలువడింది. రజనీ అల్లుడు, హీరో ధనుష్ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా రోబో 2.0 తర్వాత రజనీ చేయబోయే సినిమా తన బ్యానర్‌లోనే ఉంటుందని ప్రకటించేశారు. వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించనున్న ఈ సినిమాకు కబాలి సినిమాతో సంచలనంగా మారిపోయిన పా రంజిత్ దర్శకత్వం వహించనుండడం విశేషంగా చెప్పుకోవాలి.

‘కబాలి’ సినిమాతో రజనీకి ఎలాగైనా తిరుగులేని హిట్ వస్తుందని ఆశించిన అభిమానులను పా రంజిత్ నిరాశపరిచిన విషయం విదితమే. ఇప్పుడు అదే పా రంజిత్‌కు రజనీ మరో అవకాశం ఇవ్వడం ఇక్కడ ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి. కబాలికి సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందేమో అన్న ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతానికి రోబో 2.0 పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున రజనీ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా తన స్టైల్లో పా రంజిత్ కథను పూర్తి చేస్తున్నారట.

Exit mobile version