జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ని జోరుగా జరుపుకుంటున్న చిత్ర బృందం తాజాగా కర్ణాటకలోని చిక్బళ్లాపుర వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా జరుపుకుంది.
ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం అంటూ పునీత్ రాజ్కుమార్ ఈ రోజు మనమధ్య లేరంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, తారక్ చెప్పినట్లు ఆయన ఇక్కడే ఉండి మమ్మల్ని చూస్తూ ఉంటారని, ఆయన ఎక్కడ ఉన్న మమ్మల్ని ఆదరిస్తున్నారని, ఆయన లేని లోటు శివరాజ్కుమార్తో తీర్చుకుంటామని అన్నారు.
ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తారక్ అభిమానులకు, మెగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు రామ్చరణ్. మీరు లేనిదే మేము లేమని, ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడ్డ కూడా తారక్కు, నాకు నీడలా మీరంతా వెంటే ఉన్నారని అన్నారు. మార్చి 25న మా కష్టం, శ్రమ మీరంతా చూడడానికి వచ్చేస్తుందని చరణ్ అన్నాడు. చివరగా రాజమౌళి టీమ్ అందరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.