రష్మిక మందన్న ‘మైసా’ కొత్త పోస్టర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ (MYSAA) నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సరికొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

తాజా పోస్టర్‌లో రష్మిక లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. చీరకట్టులో, చేతికి విరిగిన సంకెళ్లు.. మరో చేతిలో ఈటె పట్టుకుని యుద్ధభూమిలో ఆమె నిల్చున్న తీరు ఆకట్టుకుంటోంది. ఒంటిపై గాయాలున్నా, ఆమె కళ్లలో కనిపించే రౌద్రం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

కాగా, ‘మైసా’ షూటింగ్ సమయంలో రష్మిక హిప్ ఇంజురీకి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కావడంతో డాక్టర్ల సలహా మేరకు కొన్ని వారాల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం గాయం నయం కావడంతో ఆమె తిరిగి సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి సాథి సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ఆడియో హక్కులను టీ-సిరీస్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నాయి.

Exit mobile version