ప్రముఖ నిర్మాత దిల్రాజు, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో ‘భద్ర’ తర్వాత చాలా కాలానికి ‘ఎవడో ఒకడు’ అన్న సినిమా ప్రారంభం అయి, సెట్స్పైకి వెళ్ళకముందే ఆగిపోయిన విషయం తెలిసిందే. రవితేజకు, దిల్రాజుకు మధ్య బేధాభిప్రాయాలు రావడం వల్లనే ఆ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. ఇక ఆ సినిమా ఆగిపోయినా కూడా ఈ ఇద్దరూ తమ కాంబినేషన్ను మళ్ళీ తాజాగా ‘రాజా ది గ్రేట్’తో పున:ప్రారంభించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాను ప్రారంభించారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమాలో రవితేజ ఓ అంధుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్స్ బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రవితేజ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా ఆగష్టు నెలలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.