ముఖ్య అంశాలు
- ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి.
- గత మూడు సీజన్లుగా కెప్టెన్ల ఫోటోషూట్లో హార్దిక్ పాండ్య పక్కన నిలబడిన కెప్టెన్ల జట్లే టైటిల్ గెలుస్తూ వస్తున్నాయి.
- ఈ ఏడాది ఫోటోషూట్లో ఆ ప్లేస్లో శుభ్మన్ గిల్ ఉండటంతో జీటీ ఫ్యాన్స్ కప్పు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆన్ ఫీల్డ్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఒకవైపు ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే ‘హార్దిక్ పాండ్య సెంటిమెంట్’. ఈ మ్యాజిక్ వర్కౌట్ అయితే ఈసారి కప్పు గుజరాత్దే అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
అసలేంటి ఆ సెంటిమెంట్?
సాధారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు పది జట్ల కెప్టెన్లతో టోర్నీ మేనేజ్మెంట్ ఒక ఫోటోషూట్ నిర్వహిస్తుంది. అయితే 2023 నుంచి ఈ ఫోటోలలో ఒక ఆసక్తికరమైన ప్యాట్రన్ కనిపిస్తోంది. ఫోటో దిగే సమయంలో హార్దిక్ పాండ్య పక్కన నిలబడే కెప్టెన్ జట్టు ఆ ఏడాది టైటిల్ ఎగరేసుకుపోతోంది. 2023 సీజన్ కెప్టెన్ల ఫోటోలో పాండ్య పక్కన ఎంఎస్ ధోని నిలబడ్డారు. ఆ ఏడాదే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో గుజరాత్ను ఓడించి కప్పు కొట్టింది. ఆ తర్వాత 2024 సీజన్ ఫోటోలో పాండ్య పక్కన కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కనిపించారు. ఆ ఏడాది పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కేకేఆర్ ఛాంపియన్గా నిలిచింది.
ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ ఫైట్
ఇక గతేడాది (2025) విషయానికి వస్తే, ఫోటోషూట్లో పాండ్యకు పక్కన రజత్ పాటీదార్ నిల్చున్నారు. ఆ సీజన్లోనే ఏళ్ల నాటి కలను నిజం చేసుకుంటూ ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇదంతా చూసిన నెటిజన్లు ఇప్పుడు 2026 ఫోటోషూట్పై కన్నేశారు. ఈ ఏడాది పాండ్య పక్కన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నిల్చుని పోజులిచ్చాడు. యాదృశ్చికంగా ఫైనల్కు కూడా గుజరాత్ దూసుకురావడంతో ఈ సెంటిమెంట్పై ఫ్యాన్స్లో నమ్మకం మరింత బలపడింది.
మరోవైపు ఈ ఏడాది టోర్నీలో ఆర్సీబీ ఎంతో అగ్రెసివ్గా ఆడుతూ వరుసగా రెండో టైటిల్పై కన్నేసింది. గుజరాత్ మాత్రం సైలెంట్గా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. సెంటిమెంట్లు, లెక్కలు ఎలా ఉన్నా మైదానంలో బాగా ఆడిన జట్టుకే విజయం దక్కుతుంది. మరి పాండ్య మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యి జీటీ ఛాంపియన్గా నిలుస్తుందా, లేక ఈ ట్రెండ్ను బ్రేక్ చేస్తూ బెంగళూరు మరోసారి కప్పు కొడుతుందా అనేది ఆదివారం రాత్రికి తేలిపోతుంది.
