తమిళనాట ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు ప్రస్తుతం ఒక రాజకీయ మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తుండగా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చేశారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడుకు సంబందించిన అన్ని రాజకీయ, సామాజిక అంశాలలోను జోక్యం చేసుకుంటూ తన అభిప్రాయాన్ని బల్లగుద్దినట్టు చెబుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు కమల్.
ఒకవైపు విమర్శలు తలెత్తుతున్నా మరోవైపు యువత, మేధావులు, రాజకీయ నాయకుల్లో చాలా మంది కమల్ ఆలోచనా ధోరణి సమాజానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. అయితే తొలి నుండి ఆయన కొత్త పార్టీ పెడతారా లేకపోతే ప్రస్తుత పార్టీల్లో ఎందులోనైనా చేరతారా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుండగా కమల్ కొత్త పార్టీ పెడతారని చాలా వరకు స్పష్టమైంది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో దేని భావజాలంతోను తన రాజకీయ లక్ష్యాలు నెరవేరవని, ప్రస్తుత తమిళ రాజకీయాల్లో మార్పు అవసరమని, దాన్ని తానే తీసుకురావాలనుకుంటున్నట్టు కమల్ విశ్వసిస్తున్నారని, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పాల్గొనాలనే యోచనలో ఉన్నారని వినికిడి.