సాయి తేజ్ విషయంలో మీడియా హేయం..ఎంతవరకు సమంజసం?

సాయి తేజ్ విషయంలో మీడియా హేయం..ఎంతవరకు సమంజసం?

Published on Sep 12, 2021 7:18 PM IST

మారుతున్న కాలంతో పాటు ఆనతిగా ఉన్న ఎన్నో వాటికి అర్ధాలు మారినట్టుగా మీడియా అర్ధం కూడా మారిపోయింది.. కనీస ‘విలువలు’ అనేవి మర్చిపోయారో అసలు మనస్సాక్షి అనేది ఏమన్నా ఉందో దానిని కూడా పక్కన పెట్టేస్తున్నారేమో అన్నది ప్రస్తుతం ఈ కనిపించని విలువలు కోసం వెతుకుతున్న కొంతమంది మదిలో ఉన్న ప్రశ్న. దీనిని ముఖ్యంగా మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపే మీడియా వ్యవస్థ విస్మరించడం బాధాకరం..శోచనీయం.

దీనికి తాజా నిదర్శనం మన టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియా వ్యవహరిస్తున్న పని తీరు అని చెప్పాలి. ఇక ప్రపంచంలో లేదా మన రాష్ట్రాల్లోనే మరో సమస్య లేదు అన్నట్టు దీనిని పదే పదే చూపిస్తున్నారు. సరే ప్రమాదం జరిగింది ప్రజలకు తెలియజేయాలి అని చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒక వార్తని సక్రమంగా చేరవేస్తున్నారా అంటే అది మనవాళ్ళు ఎప్పుడో మర్చిపోయిన ప్రధాన అంశం.

రేసింగ్ లు అని, మద్యం సేవించాడు అని 400 స్పీడ్ అని ఏవేవో.. అసలు సంబంధమే అంశాలను జోడించి తెలియని ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు.. ఇది ఓ రకంగా స్లో పాయిజనింగ్ లాంటిదే మరి. దీనితో అసలు నిజం ఏమిటి అన్నది తెలియక మీడియా చూపుతుంది నిజం అనుకోని ఊర్లలో చర్చలు పెట్టుకోని వారు ఉండరు అనుకోవడంలో నిజం లేదు అంటారా? ఇప్పుడు ఇదే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

అసలు సాయి తేజ్ విషయంలో జరిగింది ఏమిటి? పోలీసు శాఖ వారు చెబుతున్నదేంటి దానిని వీరు వక్రీకరించి చూపిస్తుంది ఏమిటి? దేశంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అమానుషంగా చిన్న పిల్లలను చిదిమేస్తున్నారు. వాటిని గంటల తరబడి చూపించి ప్రజలను చైతన్యం చెయ్యొచ్చు కదా? అలాంటివి చెయ్యరు.. నిజ జీవితంలో ఓ సెలెబ్రెటీ ముఖ్యంగా సినీ పరిశ్రమకి చెందిన వారి విషయంలో అయితేనే ఇష్టమొచ్చిన కథనాలు ప్రచారం చేసుకుంటారు.

దీనికి సరైన ముగింపు ఎప్పుడు వస్తుందో కానీ అది వచ్చే వరకు కూడా ఇలా ఎంతో మంది వారు ప్రచురిస్తున్న టీఆర్పీ స్టంట్ ఫాల్స్ న్యూస్ లు మాత్రం ఆగవు అని చెప్పాలి. వీటికి ఏ కర్మ సిద్ధాంతమో కాలమో సమాధానం చెప్పాల్సిందే మరి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు