టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారం పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.
దీని అనంతరం ఎస్ ఎస్ రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేయనున్నారు మహేష్ బాబు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీపై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల అనంతరం సందీప్ రెడ్డి వంగతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ 30వ సినిమా చేయనున్నారని అంటున్నారు.
మహేష్ బాబు కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నాను, సరైన టైం వచ్చినపుడు దానిని పట్టాలెక్కిస్తాం అంటూ గతంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో మహేష్ బాబు పవర్ఫుల్ మాస్ గ్యాంగ్ స్టర్ రోల్ చేయనున్నారట. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ స్టోరీ అద్భుతంగా సిద్ధం చేసారట దర్శకుడు సందీప్. ఒకవేళ ఇదే నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.