యువ దర్శకుడితో రజనీ కొత్త సినిమా?

rajinikanth
‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలూ ఇటు బాక్సాఫీస్ పరంగానూ, అటు విమర్శకుల ప్రశంసల పరంగానూ డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. దీంతో తన కొత్త సినిమా విషయంలో రజనీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘లింగా’ విడుదలై దాదాపుగా ఐదు నెలలైనా ఇప్పటికీ ఏ సినిమానీ అనౌన్స్ చేయలేదు. అయితే ఇదే సమయంలో తమిళంలో పేరుగాంచిన దర్శకులైన శంకర్, మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు రజనీ సినిమా కోసం తెరపైకి వచ్చాయి.

ఇదే కోవలో తాజాగా ఓ కొత్త దర్శకుడి పేరు వచ్చి చేరండం ఆసక్తికరంగా మారింది. ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో రజనీ నటించనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో రజనీ ఉన్నారట. ఈ క్రమంలోనే రంజిత్ కథ నచ్చి అతణ్ణి దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కళైపులి థాను ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.

Exit mobile version