ప్రముఖ దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంతి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా కంటే కూడా తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బాల మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై గతంలో ఈషా స్పందిస్తూ.. అవునని గానీ, కాదని గానీ చెప్పకుండా దాటవేసింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్లకు తరుణ్ భాస్కర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న బంధాన్ని గురించి చెబుతూ.. ‘దీని గురించి ప్రకటించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను. ఈషా నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదు, అంతకుమించి. గత కొన్ని సంవత్సరాలుగా నా జీవితంలో ఆమె ఒక అద్భుతమైన తోడుగా ఉంటోంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కావడం వల్ల, నేను ఇచ్చే స్టేట్మెంట్ ఇతరులపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు.
తరుణ్ భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలతో వీరిద్దరి రిలేషన్ షిప్పై వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టమైంది. ఈ ప్రకటనతో అటు టాలీవుడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో వీరి పెళ్లి గురించిన ఆసక్తి మొదలైంది.
