మా సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేస్తాయి – దర్శక, నిర్మాతలు బాబా పి.ఆర్‌, మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌

Published on Sep 19, 2023 9:39 am IST

సూర్య, విషిక హీరో హీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం అష్టదిగ్బంధనం. ఈ మూవీ యొక్క ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ ఇటీవలే ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి బేబి చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ సినిమాలోని ఐయామ్ విత్ యూ సాంగ్ లాంచ్ చేశారు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అష్టదిగ్బంధనం దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్‌. మాట్లాడారు.

 

అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌ కదా దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు?
నిజమే అది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌. ఈ సినిమాలో దాన్ని జస్టిఫై చేసేలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాం. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇందులోని ప్రతి క్యారెక్టర్‌ అవతలి వారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటారు. ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ.

 

ట్రైలర్‌లో హింస ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది?
ఇది యాక్షన్‌, థ్రిలర్స్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి బాగా కనెక్ట్‌ అవుతుంది. అలాగని ఇతర వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోలేదు అని కాదు. అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. మొదటి ట్రైలర్‌లో కొంత యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా చూపించడం వల్ల మీకు హింస ఎక్కువ అనిపిస్తోంది. నెక్ట్స్‌ ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునే అంశాలు ఉంటాయి.

 

మీ తొలి చిత్రం ‘సైదులు’కి దీనికి ఉన్న తేడా?
నా తొలి చిత్రం సైదులు అయినా ఈ అష్టదిగ్బంధనం అయినా కథను నమ్మే చేశాను. ఒక టెక్నీషియన్‌గా ఈ రెండు సినిమాలకే కాదు భవిష్యత్తులో నేను చేయబోయే సినిమాలకు కూడా ఒకే విధంగా కష్టపడతాను.

 

కొత్త ఆర్టిస్ట్‌లతో రిస్క్‌ అనిపించలేదా?
కథలో విషయం ఉంటే ఆర్టిస్ట్‌లు ఆటోమేటిక్‌గా పెర్ఫార్మ్‌ చేస్తారు. ఇందులో కూడా కొత్తవారైనా ఆర్టిస్ట్‌లు అందరూ ఎక్స్‌పీరియెన్స్‌డ్‌గా కనిపిస్తారు. తప్పకుండా వారి నటన అందరినీ అలరిస్తుంది.

 

సంగీత దర్శకుడిగా జాక్సన్‌ విజయన్‌ను ఎంపిక చేసుకోవటానికి కారణం?
ఆయన మలయాళ చిత్రాల్లో ఎంత మంచి టెక్నీషియనో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన తాజా సూపర్‌హిట్‌ ట్రాన్స్‌ ఎంతటి విజయం సాథించిందో కూడా తెలుసు. మా సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. అందుకే ఆయన్ను ఎంచుకున్నాం. వెరీ నైస్‌ పర్సన్‌. ఇందులో మూడు పాటలు ఉంటాయి వాటికి కూడా ఆయన మంచి సంగీతం ఇచ్చారు.

 

నిర్మాత గురించి చెప్పండి ?
మా నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ గారు బిజినెస్‌ మ్యాన్‌. సినిమాల మీద కూడా ఇంట్రస్ట్‌ ఉంది. ఈ కథ చెప్పగానే బాగా ఇంప్రెస్‌ అయ్యారు. కథ కోసం నేను ఏది అడిగితే అది అరేంజ్‌ చేశారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఫైనల్‌గా ప్రేక్షకులకు ఏం చెప్పదల్చుకున్నారు? నేను ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటే.. ఈనెల 22న మీరు థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీరు కొన్న టిక్కెట్‌ రేట్‌కు మరిన్నిరెట్లు సంతృప్తినిస్తుంది.

 

అనంతరం నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడారు.

 

నిర్మాతగా తొలి ప్రాజెక్ట్‌కే ఇంత రిస్క్‌ సబ్జెక్ట్‌ ఎంచుకోవడానికి కారణం?
ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా. ఈ కథను వినగానే చాలా ఎగ్జైట్‌ ఫీలయ్యా. ఇలాంటి కథతో నిర్మాతగా మారుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక రిస్క్‌ అంటారా.. కథలో ఉన్న బలం ఆ రిస్క్‌ను తీసుకోవటానికి నన్ను ఎంకరేజ్‌ చేసింది. ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే కథ, కథనాలు సినిమా హైలైట్‌.

 

బడ్జెట్‌ విషయంలో ఎక్కడైనా అష్టదిగ్బంధనంకు గురయ్యారా?
లేదండి. ముందే ఈ సినిమాకు బడ్జెట్‌ ఎంత అనేది ఫిక్స్‌ అయ్యాం. దాన్ని బట్టి ముందుకు వెళ్లాం. ఎక్కడా ఓవర్‌ బడ్జెట్‌ అవలేదు.

 

సినిమా అనేది కళాత్మక వ్యాపారం. మీరు ఇందులో కళను చూసి నిర్మాణం చేపట్టారా? వ్యాపారం చూసి దిగారా?
బేసిక్‌గా నేను వ్యాపారస్తుణ్ణి. ముందు అయితే ఇది కూడా ఒక వ్యాపారం అనే భావనతోనే దిగాను. ఆ తర్వాత ఇది 24 క్రాఫ్ట్స్‌తో కూడిన కళాకారుల క్రియేటివిటీకి దర్పణం అని అర్ధమైంది. అక్కడి నుంచి దీన్ని కళాత్మక వ్యాపారంగానే చూడటం మొదలు పెట్టాను.

 

ఇవాళ చిన్న సినిమాలు విడుదల కావడమే కష్టమైపోయింది. మీరు ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్‌ పెట్టారు?
కేవలం కథ మీద ఉన్న నమ్మకమే నన్ను ముందుకు నడిపింది. సినిమాను సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. వారికి కావాల్సిన అన్ని అంశాలు జాగ్రత్తగా ఇమడ్చగలిగితే ఖచ్చితంగా సక్సెస్‌ వస్తుంది. దర్శకుడు బాబాగారు ముందు చెప్పిన దానికన్నా అద్భుతంగా తీశారు.

 

బిజినెస్‌ సైడ్‌ నుంచి రెస్పాన్స్‌ ఎలా ఉంది?
చాలా బాగుంది. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు 150 నుంచి 200 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.

థాంక్యూ అల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం :