కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడడంతో మళ్ళీ మెల్ల మెల్లగా సినిమా థియేటర్లు, షూటింగ్లు తిరిగి పున: ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోగా చిత్ర పరిశ్రమలో తిరిగి సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో వారవారం థియేటర్ మరియు ఓటీటీల్లో అరడజన్కి పైగా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్కి సిద్దమయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేద్దాం.
* మ్యాచో స్టార్ గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటిమార్’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కాబోతుంది.
* తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “తలైవి”. జయలలితగా కంగనా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
* తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
* నేచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది.
* లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంలో తెరకెక్కించిన చిత్రం ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నరసింహ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న థియేటర్లలో విడుదల కానుంది.
* రాహుల్ రామకృష్ణ, అవికాగోర్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్’. సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ‘జీ5’ ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి విడుదల కాబోతుంది.