హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడానికి రెడీ అయిపోయాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం రేపు ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోలో జరిగనుంది.
ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు ఇలా మెగా హీరోలందరూ రానున్నారు. ఇక ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైటర్గా కూడా పనిచేశారు.
ఇక ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల పని చేస్తుండటం విశేషం. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు లాంచ్ రోజునే ప్రకటించనున్నారు.