సరస్వతి కాంట్రోవర్సీ.. స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్..!

Saraswathi

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకత్వం వహించిన ‘S. సరస్వతి’ చిత్రం నిన్న(మార్చి 6) విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అయితే, ఈ సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. తన కథను పూర్తిగా మార్చేశారని, అసలు కథను ‘రేప్’ చేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదంపై స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. సాయి మాధవ్ బుర్రాపై తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూనే కొన్ని కీలక వివరణలు ఇచ్చారు. తాను కథను దొంగిలించలేదని, సరైన పద్ధతిలోనే డబ్బు చెల్లించి ఆ కథను కొనుగోలు చేశానని ఆమె స్పష్టం చేశారు. ఒకసారి కొన్న తర్వాత ఆ కథ తన సొంతమవుతుందని, ఆరేళ్లుగా ఆయన దగ్గరే ఉన్న బేసిక్ ప్లాట్ తీసుకుని నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే మార్చినట్లు తెలిపారు. ఈ చిత్రంలో కథా రచయితగా ఆయనకు పూర్తి క్రెడిట్ కూడా ఇచ్చానని ఆమె గుర్తు చేశారు.

మరోవైపు, సాయి మాధవ్ బుర్రా ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఒక్కసారి కూడా కథా చర్చల్లో పాల్గొనలేదని వరలక్ష్మీ తెలిపారు. ఒక సీనియర్ రచయిత అయ్యుండి, ముఖ్యంగా మహిళల ఇతివృత్తంతో సాగే సినిమా విషయంలో ‘రేప్’ వంటి పదాలను వాడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సున్నితమైన అంశంపై సినిమా తీస్తున్నప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందని ఆమె పేర్కొన్నారు.

Exit mobile version