‘వరుడు కావలెను’ ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసింది – నాగశౌర్య

‘వరుడు కావలెను’ ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసింది – నాగశౌర్య

Published on Oct 31, 2021 3:05 AM IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం నిన్న రిలీజై అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సినిమాకు మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘వరుడు కావలెను’ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మొదటి నుంచి నేను బలంగా నమ్మానని, ఇవాళ మా నమ్మకం నిజమైందని, ‘వరుడు కావలెను’ చిత్రాన్ని చూసి ఆదరించిన ప్రేక్షకులకు, చూడబోయే ప్రేక్షకులకు కూడా థాంక్స్ చెబుతున్నా. థియేటర్లకు వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా బాగా నచ్చిందని, ‘వరుడు కావలెను’ చిత్రంతో మీకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్లదే కాదు, ఎంతోమంది తెర వెనక పనిచేశారు వాళ్లందరి విజయంలో భాగముంది. నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలని అనుకుంటున్నానని అన్నారు.

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ‘వరుడు కావలెను’ సినిమాకు మీరు ఇచ్చిన విజయానికి చాలా థాంక్స్ అని, మా మూవీ టీమ్ అంతా ఒక మహిళైన నన్ను నమ్మి సపోర్ట్ చేసి సినిమా చేయించారని, అక్కా అని పిలిచే నాగశౌర్య నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని అన్నారు. చినబాబు గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం, సితార లాంటి మంచి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమా సక్సెస్ చేసి మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నానని, ఇదే కాదు భవిష్యత్ లో నేను చేయబోయే సినిమాలు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా ఉంటాయని అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘వరుడు కావలెను’తో ఒక క్లీన్ మూవీ చేశాం. థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అని, సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా బాగుందనే మౌత్ టాక్ తో ప్రతి షో కు థియేటర్ లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఒక కొత్త డైరక్టర్‌ని తీసుకొచ్చి మా సంస్థకు హిట్ ఇచ్చినందుకు హీరో నాగశౌర్యకు థాంక్స్ చెబుతున్నా. మా సంస్థలో మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకొస్తామని అన్నారు.

మాటల రచయిత గణేష్ రావూరి మాట్లాడుతూ మాటల రచయితగా ‘వరుడు కావలెను’ చిత్రంతో మీ ముందుకొచ్చాను. సినిమా చూసిన వాళ్లంతా మాటలు బాగున్నాయి అంటున్నారు. అది నా ఒక్కడి క్రెడిట్ కాదు. నేను రాసిన డైలాగ్స్ చక్కగా పలికిన హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతు వర్మ, ఇతర నటీనటులకు ఆ ఘనత దక్కుతుంది. 20కి పైగా సినిమాలు చేసిన హీరో నాగశౌర్య గారు, నేను ఏదైనా సలహా చెబితే వెంటనే తీసుకునేవారు. సినిమా బాగా రావాలని ఒక టీమ్ లా వర్క్ చేశాం. కొత్త వాళ్లం అయిన మాకు సపోర్ట్ చేసిన హీరో, ఇతర టీమ్ కు థాంక్స్. చాలా సినిమాలకు రివ్యూ రాసిన నేను నా చిత్రానికి తీర్పు ఇచ్చుకోలేను. ఎందుకంటే మేము ప్రేమించి చేసిన సినిమా కాబట్టి. ‘వరుడు కావలెను’ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఇది ప్రేక్షకులకు ఎంతగా నచ్చుతుంది అని మాత్రమే ఆలోచించే చేశాం. ఇవాళ మా నమ్మకం నిజమై ఘన విజయాన్ని అందించారని అన్నారు.

నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ ‘వరుడు కావలెను’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. మీ దగ్గర్లోని థియేటర్ లో తప్పక చూడండి. మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని అన్నారు.

నటి హిమజ మాట్లాడుతూ ‘వరుడు కావలెను’ సూపర్ సక్సెస్ సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ అని, సెల్ఫీ సరళ పాత్రలో నేను బాగా నటిస్తాను అని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకురాలు సౌజన్య గారికి థాంక్స్. నాకు ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్ లాంటిది. ఎందుకంటే నేను ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. సోషల్ మీడియాలో యాక్టివ్గ్ గా ఉంటాను. సేమ్ క్యారెక్టర్ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. నా క్యారెక్టర్ తో పాటు సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతుండటం సంతోషంగా ఉందని అన్నారు.

కొరియోగ్రాఫర్ విజయ్ మాట్లాడుతూ ఈ పాండమిక్ టైమ్ లో థియేటర్‌లో రిలీజైన ఓ సినిమా విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ‘వరుడు కావలెను’ చిత్రాన్ని థియేటర్‌కు వచ్చి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ అని, చాలా ఏళ్లుగా ఈ బ్యానర్‌లో వర్క్ చేస్తున్నాను. నిర్మాత నాగవంశీ గారు ఆయన ప్రతి సినిమాలో నాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తారు. ఈ చిత్రంలో కోల కళ్లె పాటకు కొరియోగ్రఫీ చేశాను. ఈ పాటకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు.

నటుడు అర్జున్ మాట్లాడుతూ నిర్మాత వంశీ గారు రీసెంట్ గా నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు మంచి హిట్ అందుకున్నారు. గతంలో ఇదే సంస్థలో ప్రేమమ్ చిత్రంలో నటించాను. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘వరుడు కావలెను’ లో నటించాను. ఇదీ ఘన విజయం సాధించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో రెండు హిట్ చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందని, నన్ను బాగా సపోర్ట్ చేసిన నాగశౌర్య గారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

గీత రచయిత గోసాల రాంబాబు మాట్లాడుతూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. ‘వరుడు కావలెను’ రిజల్ట్ కోసం నిన్నటి వరకు చూశామని, సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం సంతోషంగా ఉందని, ఈ చిత్రంలో కోల కళ్లే అనే పాట రాశాను. ఈ పాటకు మంచి పేరొచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘వరుడు కావలెను’ మీ ముందుకొచ్చింది. చూసి మరింత ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు