అలా వరుడు కావలెను టీమ్ లోకి వచ్చా – మాటల రచయిత గణేష్ రావూరి

అలా వరుడు కావలెను టీమ్ లోకి వచ్చా – మాటల రచయిత గణేష్ రావూరి

Published on Nov 2, 2021 5:48 PM IST


టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ చిత్రం వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రం తో దర్శకురాలు గా సినీ పరిశ్రమ కి పరిచయం అయ్యారు. అదే విధంగా వరుడు కావలెను చిత్రంతో మాటల రచయితగా పరిచయం అయ్యారు గణేష్ రావూరి. ఈ సినిమా విజయంలో డైలాగ్స్ కు మంచి క్రెడిట్ దక్కింది అని చెప్పాలి. వరుడు కావలెను సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మాటల రచయిత గణేష్ రావూరి సినిమాకు పనిచేసిన తన అనుభవాలను, కెరీర్ విశేషాలను ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు.

డైలాగ్ రైటర్ గణేష్ రావూరి మాట్లాడుతూ, “గతంలో సోలో బ్రతుకే సో బెటర్ తో పాటు ఒకట్రెండు చిత్రాలకు ఒక వెర్షన్ డైలాగ్స్ రాశాను. పూర్తిగా ఓ సినిమాకు వర్క్ చేసింది మాత్రం వరుడు కావలెను చిత్రానికే. ఈ సినిమాకు నిర్మాత నాగ‌వంశీ గారు పిలిచి నువ్వు బాగా రాస్తావని విన్నాను, మా కొత్త సినిమాకు మాటలు ఒక వెర్షన్ రాసి ఇవ్వు, బాగుంటే చేద్దామని చెప్పారు. నేను పోర్షన్ లా డైలాగ్స్ రాస్తూ మొత్తం కథకు మాటలు రాశాను. అవి చూశాక బాగుందని ఓకే చేశారు. అలా వరుడు కావలెను టీమ్ లోకి వచ్చాను” అని అన్నారు.

“వరుడు కావలెను సినిమాకు వస్తున్న స్పందన, మాటలు బాగున్నాయంటూ వచ్చే ప్రశంసలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇండస్ట్రీలో పెద్ద దర్శకుల దగ్గర నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. నేను రాసిన మాటలు విని నిర్మాత చినబాబు గారు నవ్వడం నాకు అతి పెద్ద ప్రశంస అనుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు.

వరుడు కావలెను కథలో కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉంటాయి. ఈ రెండింటికీ మాటలు బాగా కుదిరాయి. హీరో హీరోయిన్ల పాత్రలకు ఓ పరిధి ఉంటుంది. ఆ పరిధి మేరకు మాటలు రాశాను. హీరో హీరోయిన్ల పాత్రలు తమ మనసులో మాటను ఒకరికొకరు చెప్పకుండా మాటలు, కథనాన్ని ఒక బిగితో చివరి వరకు తీసుకెళ్లాం. హీరోతో హీరోయిన్ రెండు సార్లు ప్రేమలో పడటం నాకు బాగా నచ్చిన అంశం అంటూ వివరించారు.

రచయితగా త్రివిక్రమ్ గారి శైలిని అనుసరించలేదు. ఆయనలా రాశానని ఎవరైనా చెబితే దాన్ని పెద్ద గౌరవంగా భావిస్తా అని వ్యాఖ్యానించారు. త్రివిక్రమ్ గారు చిన్న పదాలతో మాటలు రాస్తారు. నేను మాత్రం ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో అలా మాటలు రాశాను. దర్శకురాలు సౌజన్య, నిర్మాత నాగ‌వంశీ గారు కూడా అలాగే రాయమని ప్రోత్సహించారు అని అన్నారు.

సినిమా సక్సెస్ మీట్ లో దర్శకురాలు సౌజన్య గారు సినిమా విజయంలో డైలాగ్స్ కు మంచి క్రెడిట్ ఇచ్చారు. అది ఆమె గొప్పదనం అనుకుంటాను. ఆమే కాదు సినిమా టీమ్ మొత్తం నేను కొత్త రైటర్ ను అయినా నన్ను వాళ్లలో కలుపుకున్నారు. స్నేహితుడిలా ప్రోత్సహించారు అని తెలిపారు.

వెన్నెల కిషోర్, హిమజ, శ్రావణి, ప్రవీణ్ క్యారెక్టర్ లు చేసిన కామెడీ కథలో నుంచి పుట్టిందే. వాటికి సెపరేట్ గా కామెడీ ట్రాక్ రాయలేదు. అలాగే సెకండాఫ్ లో పమ్మి సాయి, సప్తగిరి పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో హీరోయిన్లు తమ లవ్ చెప్పుకోకుండా ఉండేందుకు పెళ్లి నేపథ్యంతో ఈ కొత్త క్యారెక్టర్ లు ఇంట్రడ్యూస్ చేశాం. వాటికి థియేటర్ లో రెస్పాన్స్ బాగుంది అని అన్నారు.

కమర్షియల్ మూవీస్ కు, మాస్ చిత్రాలకు మాటలు రాయాలని ఉంది. త్వరలో అలాంటి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. వరుడు కావలెను చిత్రం సర్వత్రా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని గట్టి వసూళ్లను రాబడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు