సమీక్ష : 26/11 ఇండియాపై దాడి – వాస్తవాన్ని చూపించే ప్రయత్నం

సమీక్ష : 26/11 ఇండియాపై దాడి – వాస్తవాన్ని చూపించే ప్రయత్నం

Published on Mar 2, 2013 2:00 PM IST
india-pi-daadi విడుదల తేదీ : 22 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : పరాగ్ సంఘ్వి, గోపాల్ దల్వి
సంగీతం : రూషిన్ దలాల్, అమర్ మొహిలే
నటీనటులు : నానా పటేకర్, సంజీవ్ జైస్వాల్, అతుల్ కులకర్ణి


వరుసగా పరాజయాలను ఎదుర్కొంటూ ప్రేక్షకుల నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కించిన సినిమాతో మనముందుకు రానున్నాడు. ’26/11 ఇండియాపై దాడి’ సినిమాని 2008 నవంబర్ 26న ముంబై లోని తాజ్ హోటల్, నరిమన్ హౌస్ మీద జరిగిన టెర్రరిస్టుల అటాక్స్ ఆధారంగా తీసారు. నానా పటేకర్, సంజయ్ జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సంఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశ ప్రజలు షాక్ కి గురయ్యారు. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ముంబైలో మేము ముందుగానే స్పెషల్ షో చూడటం వల్ల ముందుగానే రివ్యూని మీకందిస్తున్నాము. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ సంఘటనలో చనిపోయిన వారికి, బాధితులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం.

కథ :

ముంబై జాయింట్ పోలీస్ కమీషనర్ రాకేష్ మరియా(నానా పటేకర్) 26/11 న జరిగిన షాకింగ్ సంఘటన గురించి కమిటీకి చెబుతూ ఉన్నప్పుడు సినిమా మొదలవుతుంది. ఒక పదిమంది టెర్రరిస్టులు గేట్ వే ఆఫ్ ఇండియాలో ఒక పడవని హైజాక్ చేసి ముంబై లోకి ఎలా ఎంటర్ అయ్యారు, అలాగే ఆ గ్రూప్ లోని 20 సంవత్సరాల అజ్మల్ కసబ్(సంజయ్ జైస్వాల్) గురించి చెబుతుంటాడు కమీషనర్.

టెర్రరిస్టులంతా ఒక పథకం ప్రకారం వచ్చి అక్కడి నుంచి అందరూ బ్యాచ్ లుగా విడిపోయి సిటీలోని పలు ఏరియాల్లో దాడులు చేసారు. అందులో ఇద్దరు ఫెమార్ లియోపోల్డ్ కేఫ్ కి, మరొక ఇద్దరు ఫేమస్ తాజ్ హోటల్ కి వెళ్లి చాలామందిని అతిదారుణంగా కాల్చి చంపారు. వారు చిన్నా, పెద్దా, మహిళలు అని తేడా లేకుండా అందరినీ అతి కిరాతకంగా చంపారు. కసబ్ తన పార్టనర్ తో కలిసి వీటీ స్టేషన్లోని ప్రయాణికుల మీద దాడి చేసారు. అలాంటి తరుణంలో వారితో పోలీసులు ఎలా పోరాడారు? టెర్రరిస్టులను ఎలా అంతమొందించారు? కసబ్ ని అరెస్టు చేసారు అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా కోసం నిర్మించిన తాజ్ హోటల్ సెట్ సూపర్బ్ గా ఉంది, అలాగే రామ్ గోపాల్ వర్మ తీర్చి దిద్దిన పాత్రలు రియాలిటీకి చాలా దగ్గరగా, నమ్మశక్యంగా ఉన్నాయి. వర్మ అటాక్స్ లోని ప్రతి ఎమోషనల్ మోమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ అటాక్స్ వల్ల పోలీస్ అధికారులు పడిన ఇబ్బందులను, ఈ సంఘటన వల్ల దిగ్బ్రాంతి చెందిన కొంతమంది ప్రజల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా ఎఫ్ఫెక్టివ్ గా ఉండే కొన్ని సీన్స్ సినిమాలో ఉన్నాయి.

అలాగే సినిమాలో వారు వాడిన ఆయుధాల గురించి ఒక గన్ మాగజైన్ తో పాటు దక్ట్ టేప్ ని వాడటం, ఏకే 47 ని ఆటో మోడ్ లో ఆన్, ఆఫ్ చేయడం మొదలైన చిన్న చిన్న విషయాలను కూడా బాగా చూపించారు.

ఇక నటీనటుల విషయానికొస్తే అజ్మల్ కసబ్ పాత్రలో సంజయ్ జైస్వాల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. అలాగే నానా పటేకర్ నటన పీక్స్ లో ఉంటుంది, ఆయన పాత్రే సినిమాలో చాలా కీలకం. మిగతా నటులు అతుల్ కులకర్ణి, గణేష్ యాదవ్ పోలీస్ ఆఫీసర్లుగా ఎంతో ఈజ్ తో నటించారు. ఫస్ట్ హాఫ్ లో ఆ సంఘటనలో మనం అక్కేడే ఉన్నామా అని ప్రేక్షకులు ఫీలయ్యేలా చెయ్యడంలో రామ్ గోపాల్ వర్మ సక్సెస్ అయ్యారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా చూసిన తర్వాత ఒక్క విషయం చెప్పాలి రామ్ గోపాల్ వర్మకి గతంలో లాగా మంచి రోజులు ఇంకా రాలేదు. ప్రేక్షకులు అతి దారుణమైన అటాక్స్ ని మంచి గ్రిప్ ఉన్న విజువల్స్ తో చూడొచ్చు అనుకొని వెళితే మీరు నిరుత్సాహంతో బయటకి వస్తారు. ఫస్ట్ హాఫ్ లో అటాక్స్ విషయాన్ని బాగా డైరెక్ట్ చేసినా, సెకండ్ హాఫ్ లో పూర్తిగా డైరెక్షన్ మార్చేశాడు. కొన్ని సన్నివేశాల్లో నానా పటేకర్ నేరేషన్ చాలా నిధానంగా ఉంది. అలాగే సెకండాఫ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

సంజయ్ జైస్వాల్ కొన్ని సందర్భాల్లో కావాల్సిన దానికన్నా ఎక్కువ నటించేసాడు. సినిమాలో వీటీ స్టేషన్, లియోపోల్డ్ అటాక్స్ చూసిన తర్వాత తాజ్ హోటల్ అటాక్స్, అక్కడ ఎన్.ఎస్.జీ కమాండోల ఆపరేషన్ ఊహించే విధంగా ఉంటుంది. విజువల్ ట్రీట్ తగ్గడం తప్ప పెద్దగా చెప్పుకోవడానికి నెగటివ్ పాయింట్స్ ఏమీ లేవు. సినిమా రిసల్ట్ – సంతృప్తికరంగా లేదు. క్లైమాక్స్ చాలా స్లోగా ఉంటుంది. నానా పటేకర్ – సంజయ్ జైశ్వాల్ మధ్య జరిగే జిహాద్ ఫిలాసఫీ చర్చ మానసికమైన భావోద్వేగ విభేదాలను చూపడంలో మంచిదే అయినప్పటికీ అది కామన్ ఆడియన్స్ మెచ్చుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :

హర్షరాజ్ షరఫ్ సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి, అటాక్స్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. కొన్ని కొన్ని పార్ట్స్ లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అటాక్స్ ని చూపించడంలో సక్సెస్ అయిన వర్మ సెకండాఫ్ లో ఫెయిల్ అయ్యాడు. ఎడిటింగ్ అంత ఎఫ్ఫెక్టివ్ గా లేదు, ముఖ్యంగా సెకండాఫ్ లో బాలేదు.

తీర్పు :

మొత్తంగా ’26/11 ఇండియాపై దాడి’ సాహసోపేతమైన సినిమా అని చెప్పుకోవాలి. సినిమా రియాలిటీకి దగ్గరగా, సహజ సిద్దంగా సినిమా తీసారు అనడం కంటే నిజమైన సినిమా అనుకరణ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండాఫ్ పిలాసఫీతో సాగుతుంది. రిసల్ట్ చూసుకుంటే ఇక్కడివారికి సినిమా స్లోగా ఉంటుంది, ఓ సారి చూడొచ్చు. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ది బెస్ట్ ఎఫర్ట్ పెట్టి తీసిన సినిమాల్లో ఇదొకటి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అనువాదం – రాఘవ

Click Here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు