
‘శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్, అందాల తార శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా, అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోషల్ మెసేజ్ను కమర్షియల్ అంశాలతో జోడించి చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అదే విధంగా మహేష్-శృతి హాసన్ల జంట కూడా తెరపై అందంగా కనిపించింది. ముఖ్యంగా కాలేజీ బ్యాక్డ్రాప్లో వచ్చే ఎపిసోడ్ ఈ బ్లాక్ యూత్ను బాగా ఆకట్టుకుంటోంది.
ఇక సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోన్న నేపథ్యంలో ఈ హిట్ పెయిర్కు కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. మహేష్-శృతి హాసన్ల పెయిర్ను మరో సినిమాలో కూడా చూడాలని ఆశగా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. స్క్రీన్పై ఈ ఇద్దరి జోడీ ఫ్రెష్గా కనిపించడంతో సాధారణంగానే యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ పెయిర్కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక మహేష్-శృతిల పెయిర్కు మంచి డిమాండ్ కనిపిస్తోన్న నేపథ్యంలో త్వరలోనే ఈ పెయిర్ మరో సినిమాకు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాలతో కలిసి ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్స్ కన్ఫర్మ్ అయిపోవడంతో ఈ హిట్ పెయిర్ ఇప్పుడే కనిపించే అవకాశం లేదు. అయితే ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఏదైనా, ఆ సినిమాకు ఫస్ట్ ప్రియారిటీ శృతి హాసనే అవుతుందనే అభిప్రాయం ఇప్పట్నుంచే వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ‘శ్రీమంతుడు’ సినిమా ఐదు రోజుల్లోనే 50 కోట్లకు పైనే వసూళ్ళు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.