
తెలుగు సినీ పరిశ్రమకు ఈమధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన యువహీరోల్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. ఇక తన గత చిత్రమైన ‘జాదూగాడు’తో ఓ మాస్ ఎంటర్టైనర్ను ట్రై చేసిన ఈ హీరో ప్రస్తుతం రెండు వరుస సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. నాగ శౌర్య హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా, రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న మరో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
‘అబ్బాయితో అమ్మాయి’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ‘జాదూగాడు’ రిలీజ్ అప్పుడే మొదలవ్వగా, ప్రస్తుతం కొంత ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండడం విశేషం. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్స్కు యూత్ ఆడియన్స్ దగ్గర్నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోనుందని సమాచారం.