
‘బేబి’.. ప్రస్తుతం ఈపేరు రెండు తెలుగు రాష్ట్రల్లో మారుమోగుతోంది. తన గాత్రం తో ఇప్పటికే చాలా మంది అభిమానులను సంపాదించుకుంది ఈ గాయనీమణి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అంతటి వారే బేబి పాటకు ఫిదా అయిపోయారు. ప్రత్యేకించి తనను ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. తాజాగా తనకు పాడేందుకు అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కోటి .
`ఓ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది మొదలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెలబ్రిటీ అయిపోయారు బేబి. మట్టిలో మాణిక్యం పల్లెకోకిల అంటూ బేబీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. తాజాగా మాజీ శాసన సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త టి.వెంకట్రావ్ బేబీని సన్మానించారు. రూ.1,11,111 (లక్ష 11వేల 111రూపాయలు) విరాళం ఇచ్చి, చీరలు అందజేశారు. ఈ ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో కోటి, గాయని గీతామాధురి, కేథరిన్ థ్రెసా, హీరోయిన్ కారుణ్య (బంగారి బాలరాజు), నటి రంజిత, సింగర్ మధు తదితరులు పాల్గొన్నారు.
కోటి మాట్లాడుతూ – వాట్సాప్లో పాట విని షాకయ్యాను. బేబీకి పుట్టుకతో వచ్చిన ప్రతిభ అది. ఇది ఇన్బిల్ట్ ట్యాలెంట్. కీర్తి అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. చిరంజీవి – సురేఖ గారు తన పాట వినాలని ఫోన్ చేస్తే వెంటనే తనని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లాను. చిరంజీవి గారు రూ.1లక్ష విరాళం ఇచ్చారు. పాటలు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహమాన్, బాలసుబ్రమణ్యం, జానకమ్మ అందరూ పిలిచి బేబీని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆకట్టుకుంటోంది. 5 డిసెంబర్ తర్వాత రెహమాన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రఘు కుంచె తొలి పాటను పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. రఘు మ్యూజిక్ బాగా కుదిరింది. రెండో పాటకు నాకు అవకాశమిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాటను పాడబోతున్నారు. ఎవరైనా తనకు ప్రోత్సాహకంగా ఎలాంటి సాయం చేయాలనుకుంటే చేయొచ్చు“ అని అన్నారు.
మాజీ టి.ఎమ్మెల్యే వెంకట్రావ్ మాట్లాడుతూ – గొప్ప సంగీత దర్శకులు.. యువతరాన్ని ఉర్రూతలూగించి.. ఎందరో పెద్ద స్టార్లకు గొప్ప హిట్ సంగీతం ఇచ్చిన సంగీత దర్శకులు కోటి బయటి ప్రపంచానికి తెలియని నిగూఢంగా దాగి ఉన్న బేబిలోని ట్యాలెంటును గుర్తించి సభ్య సమాజానికి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రతిభను గుర్తించి బయటకు చూపాలంటే వ్యయప్రయాసలకోర్చాలి. తనని ఒక గొప్ప గాయనిగా తీర్చిదిద్దేందుకు కోటి చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.
బేబి మాట్లాడుతూ -“ పాడతానని .. ఆ పాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నేను బట్టలు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్కడ ఆ అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైరల్ చేసింది. అనుకోకుండా అవలీలగా ఆ పాటను అందరికీ చూపించింది. మా పాపకు బాబు పుట్టాడు. ఆస్పత్రిలో ఉన్నాను. ఈ పాట వాట్సాప్లో వైరల్గా మారింది… నీకు తెలుసా? అని అన్నారు. మీ అందరి సాయంతోనే నేను హైదరాబాద్ కి వచ్చాను. కోటి సర్ బోల్ బేబి బోల్ లో పాట పాడమని అన్నారు. సర్ ప్రోత్సహిస్తున్నారంటే అది అందరి దయ. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంత ఆదరించి నన్ను మీలో ఒకరిని చేసుకున్నారు. హైదరాబాద్ అంటే భయం భయం.. పట్నంలో మంచిగా ఉండరు. లెక్క చేయని స్థితిలో ఉంటారు అని భయపెట్టారు. కానీ ఇక్కడ అందరూ నన్ను దేవుళ్లు దేవతల్లా కనిపిస్తున్నారు. ఇది నిజం. మీ అందరి దీవెనలు కావాలి. వెంకట్రావు గారు విరాళం ఇచ్చి కళను ఇంతగా ప్రేమించడం ఆశ్చర్యం కలిగించింది. మట్టిలో పుట్టి పెరిగాను. కూలి పని చేసుకునేదానిని. అన్ని పనులు చేశాను. ఇక్కడికి వచ్చాను . మీ అందరి ఆదరాభిమానులతోనూ ఇలా రాగలిగాన్నారు.