యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భగవంతుడు’. రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై రవి పనస నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.జి. విహారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్ను విడుదల చేశారు.
పల్నాడు నేపథ్యంలో సాగే ఈ కథలో సమాజంలోని అసమానతలు, వైరుధ్యాలను చర్చించామని దర్శకుడు జి.జి. విహారి తెలిపారు. పాత్రికేయుడిగా ఉన్న తనను దర్శకుడు వేణు ఊడుగుల ప్రోత్సహించి ఈ ప్రాజెక్ట్ సెట్ చేశారని, ‘అసురన్’, ‘కాంతార’ తరహాలో ఈ చిత్రం రానుందని పేర్కొన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ, కథ విన్న ఐదు నిమిషాల్లోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని, తన కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. కన్నడ నటుడు రిషి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
నిర్మాత రవి పనస మాట్లాడుతూ.. సినిమాపై ఉన్న ప్యాషన్తో బడ్జెట్ గురించి ఆలోచించకుండా క్వాలిటీ ఔట్పుట్ కోసం ప్రయత్నించామని తెలిపారు. అతిథులుగా వచ్చిన విశ్వక్ సేన్, సందీప్ కిషన్ టీజర్ చాలా బాగుందని, రవి పనస నిర్మాణ విలువలు, తిరువీర్ నటన ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
