గౌతమ బుద్ధుని జయంతిని సంపూర్ణ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ‘కింగ్ బుద్ధ’ హాలీవుడ్ చిత్ర దర్శకుడు సత్యారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బుద్ధునిపై తప్పుడు ప్రచారం చేస్తే ఇకపై సహించేది లేదని, అలాంటి ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తామని స్పష్టం చేశారు.
బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదని, ఆయనొక ‘శాక్య సింహం’ అని సత్యారెడ్డి అభివర్ణించారు. ఆయన జీవితం పిట్ట కథలు కాదని, అదొక మహా వీరగాథ అని, ఆయన తత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు కపిలవస్తు నగరంలో అడుగుపెట్టినప్పుడు, ఆయన భార్య యశోదర దీపాలతో స్వాగతం పలికిన ఘట్టమే ఆ తర్వాత ‘బుద్ధ దీపావళి’గా మారిందని వివరించారు.
బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తున్న సుమారు 25 దేశాలు శాంతి, అభివృద్ధి, సమానత్వంలో ముందంజలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. వాటి పురోగతిని చూసి భారతదేశం కూడా మళ్లీ బౌద్ధం వైపు పయనించాలని ఆకాంక్షించారు. “బుద్ధ జయంతి – జాతీయ గౌరవ దినం కావాలి” అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సత్యారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
