బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్ తాజాగా మాతృత్వ దశ తన జీవితాన్ని మార్చివేసింది అంటూ చెప్పుకొచ్చింది. ‘ఆర్టికల్ 370’, ‘హక్’ లాంటి శక్తిమంతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవలే ‘ధురంధర్ 2’లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ‘నయీ నవేలి’ అనే సినిమాతో బిజీగా ఉంది. ఐతే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యామి మాట్లాడుతూ… ‘ఇటీవలే నేను బాబుకి జన్మనిచ్చాను. నేను తల్లి కావడం నా జీవితంలో గొప్ప మలుపు. ఐతే, నా వృత్తిపరమైన ఎంపికలను నా మాతృత్వ దశ ఏ మాత్రం ప్రభావితం చేయలేదు’ అని యామీ చెప్పుకొచ్చింది.
యామీ గౌతమ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి మాతృత్వం అనేది గొప్ప భావోద్వేగం. ఇక సినీరంగంలో నా దశాబ్దాల కెరీర్ను వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ఎదుగుదలకు.. మనసుకు హత్తుకునే కథలే ముఖ్య కారణం. నా కెరీర్ లో అలాంటి కథలకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈ క్రమంలో ఎంతో సహనం అవసరం. ప్రధానంగా ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. నా పాత్రలు నన్ను ఆకట్టుకుంటేనే వాటిని అంగీకరిస్తాను. లేదు అంటే నో చెప్పేస్తాను’ అంటూ యామీ తెలిపింది.
