విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో త్రివిక్రమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వెంకటేష్ చేయబోయే నెక్స్ట్ ఎంటర్టైనర్ కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ఈ నెలలోనే సినిమాను ప్రారంభించనున్నాడు. జూన్ 15న హైదరాబాద్లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం జరగనుంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్లో నందమూరి కళ్యాణ్ రామ్ మరొక హీరోగా నటిస్తుండటం విశేషం. జూన్ మూడో వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటగా వెంకటేష్ లేని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మరోవైపు వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, జూలై చివరి నాటికి అనిల్ రావిపూడి సెట్స్లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ మల్టీస్టారర్ ఎంటర్టైనర్లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ భారీ వినోదాత్మక చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
