సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమాతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల
యాక్షన్ హీస్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘సిగ్మా’ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా.. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జాపీ, షీలా రాజ్కుమార్, కిరణ్ కొండ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం, త్వరలోనే టీజర్, పాటలతో పాటు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
