ముఖ్య అంశాలు
- రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల వర్గీకరణను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త టికెట్ ధరలను ఖరారు చేస్తూ జీవో నం.77 జారీ చేసింది.
- నాన్-ఏసీ, ఏసీ/ఎయిర్ కూల్డ్, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో నాన్-ప్రీమియం, ప్రీమియం విభాగాలకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను నిర్ణయించారు.
- సాధారణ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అన్ని థియేటర్లలో మొత్తం సీట్ల సామర్థ్యంలో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీగా కేటాయించాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో సినిమా టికెట్ ధరల నియంత్రణ, థియేటర్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG)తో పాటు పలు నిర్మాణ సంస్థలు సమర్పించిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం హోంశాఖ ఈ మేరకు నూతన జీవో (G.O.Ms.No.77) విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు అన్ని కేటగిరీలకు వర్తించేలా కనిష్ఠ, గరిష్ఠ ధరల శ్లాబులను ప్రభుత్వం నిర్దేశించింది.
థియేటర్ల వారీగా ఖరారైన టికెట్ ధరలు (రూపాయల్లో):
నాన్-ఏసీ థియేటర్లు: నాన్-ప్రీమియం కనిష్ఠం రూ.30 – గరిష్ఠం రూ.70; ప్రీమియం కనిష్ఠం రూ.50 – గరిష్ఠం రూ.100.
ఏసీ / ఎయిర్ కూల్డ్ థియేటర్లు: నాన్-ప్రీమియం కనిష్ఠం రూ.50 – గరిష్ఠం రూ.150; ప్రీమియం కనిష్ఠం రూ.100 – గరిష్ఠం రూ.200.
స్పెషల్ థియేటర్లు (7.1 సరౌండ్ సౌండ్, 2K/4K ప్రొజెక్షన్, 75 అడుగులు లేదా అంతకంటే పెద్ద స్క్రీన్ ఉన్నవి): నాన్-ప్రీమియం కనిష్ఠం రూ.100 – గరిష్ఠం రూ.250; ప్రీమియం / రిక్లైనర్ కనిష్ఠం రూ.200 – గరిష్ఠం రూ.300.
మల్టీప్లెక్స్లు: రెగ్యులర్ సీట్లు కనిష్ఠం రూ.100 – గరిష్ఠం రూ.250; రిక్లైనర్ సీట్లు కనిష్ఠం రూ.200 – గరిష్ఠం రూ.300.
25 శాతం సీట్లు నాన్-ప్రీమియం తప్పనిసరి
సామాన్య ప్రేక్షకులకు సైతం సినిమా వినోదం అందుబాటులో ఉండేలా థియేటర్ల యాజమాన్యాలు మొత్తం సీట్ల సామర్థ్యంలో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం విభాగానికే కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ లేదా మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా అన్ని థియేటర్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది.
ఈ రేట్లలో జీఎస్టీ కలవలేదని, అయితే ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 మెయింటెనెన్స్ చార్జీలు ఈ టికెట్ ధరల్లోనే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఎయిర్ కూల్డ్ థియేటర్లను ఏసీ కేటగిరీలో విలీనం చేస్తూ, వాటిని పూర్తిస్థాయి ఏసీలుగా మార్చుకోవడానికి లేదా నాన్-ఏసీ చార్జీలను వసూలు చేయడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది.
