
విభిన్న సినిమాలతో దూసుకుపోతున్న హీరో నిఖిల్ తాజాగా స్టార్ రైటర్ కోన్ వెంకట్తో జతకట్టిన విషయం తెలిసిందే! వీరిద్దరి కలయికలో ‘శంకరాభరణం’ అనే పేరుతో ఓ సినిమా రూపొందనుందనే ప్రకటన వెలువ్వడ్డప్పటి నుంచే ఈ కాంబినేషన్పై మంచి ఆసక్తి ఏర్పడింది. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ లాంటి మూడు కొత్తదనమున్న సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ ఈసారి బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా కోసం సిద్ధమైపోయారు.
గత కొద్దిరోజులుగా స్క్రిప్ట్ పనులను పకడ్బందీగా నిర్వహించుకుంటూ వచ్చిన శంకరాభరణం టీమ్ రేపట్నుంచే సెట్స్పైకి వెళ్ళనుంది. నార్త్ ఇండియాలోని సినిమా కథకు సరిపోయే పలు లొకేషన్లను ఈ మధ్యే ఎంపిక చేశారు. ఇక రేపు ఉదయం నుంచే షూటింగ్ మొదలుకానుంది. మరో విశేషమేమిటంటే.. ఉదయం మొదటి షాట్ ఓకే అయిన వెంటనే సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. తెలుగు సినిమా కథా రచన, ఫిల్మ్ మేకింగ్ ప్రక్రియలో శంకరాభరణం ఓ ట్రెండ్ సృష్టించనుందని కోన వెంకట్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇక ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం కానున్నారు. కోన వెంకట్ కథా, స్క్రీన్ప్లే అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. నిఖిల్ సరసన హీరోయిన్గా నందిత నటించనుంది.

