‘కో సమూయ్’ బయలుదేరిన అఖిల్..!

‘కో సమూయ్’ బయలుదేరిన అఖిల్..!

Published on Jun 30, 2015 1:26 PM IST

akhil
అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్యే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా థాయ్‌లాండ్‌‍కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే! ఇప్పటికే థాయ్‌లాండ్‍లోని కొన్ని ప్రదేశాల్లో ఫైట్ సన్నివేశాల షూటింగ్ జరగగా తాజాగా సినిమా యూనిట్ థాయ్‌లాండ్‌లోని మరో ప్రాంతమైన కో సూమయ్ బయలుదేరింది.

థాయ్‌లాండ్‌లో రెండో అతిపెద్ద ద్వీపమైన కో సుమాయ్‌లో కొన్ని రోజుల పాటు అఖిల్ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో బ్రహ్మనందం, వెన్నెల కిషోర్‌లు కూడా పాల్గొననున్నారు. ఇక బ్రహ్మనందంతో కలిసి ఇప్పటికే కొన్ని సన్నివేశాల్లో నటించిన అఖిల్, కామెడీ కింగ్‌తో నటించడం చాలా బాగుందని అన్నారు. ఇక కో సమూయ్ లో జరిగే షూటింగ్ తర్వాత థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తి కానుంది.

అక్కినేని వంశంలో మూడో తరంలో పరిచయమవుతోన్న అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతున్నట్లు నితిన్, వి.వినాయక్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే! తాజాగా తనపై చూపుతున్న ప్రేమకు అఖిల్ అభిమానులకు ఓ లేఖ కూడా రాసి వారిని ఆనందింపజేశారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ – తమన్‌లు సంగీతం సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు