నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత విలన్గా కూడా రాణిస్తూ వస్తోన్న తారకరత్న, తాజాగా తన కొత్త సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ‘ఎవరు?’ అన్న టైటిల్తో దర్శకుడు రమణ సాల్వ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేస్తూ తారకరత్న మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎవరు సినిమా నటుడిగా తనను మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుపుతూ, ఈ సినిమా తన కెరీర్కూ బాగా ఉపయోగపడుతుందన్నారు.
“నిర్మాత అంకమ్మ చౌదరి గారు నాకు బ్రదర్ లాంటి వారు. ఆయనొచ్చి ఓ సినిమా చేయాలనగానే కథ విని వెంటనే ఓకే చెప్పేశా. రమణా సాల్వ చాలా టాలెంటెడ్ దర్శకుడు. నేను పనిచేసిన వారిలో రవిబాబు తర్వాత నా ఫేవరైట్ అంటే రమణే. దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా రెండు బాధ్యతలనూ ఆయన సమర్ధవంతంగా పోషించారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు. ఇక తనకు ఈమధ్య కాలంలో మంచి పాత్రలు వస్తున్నాయని, హీరోగానే చేయాలనే ఆలోచన అస్సలు లేదని, ఎలాంటి పాత్రైనా చేయాలనుకుంటున్నాని తారకత్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు.