స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా సంగీతోత్సవం నిన్న హైదరాబాద్ యూస్ఫగూడ పోలీస్ గ్రౌండ్స్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ సినిమాల సరదాగా సాగేపోయే ఓ సినిమా చేయాలనిపించింది. అలాంటి సినిమాతోనే వస్తున్నాం. సినిమా రిలీజ్లో గ్యాప్ ఉంటుంది కానీ సెలబ్రేషన్లో గ్యాప్ ఉండదు అని అన్నారు.
అలాగే బన్నీ అల్లు అరవింద్ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘నాన్న గురించి నేను, నా గురించి నాన్న ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. నన్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే. కానీ ఈ రోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ కేవలం నాతో సినిమా చేసినందుకు కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేనేమో. కనీసం నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్ కలుగుతుంది. మా నాన్నను నేను ప్రేమించినంతగా మరేవరినీ ప్రేమించను. నేను ‘ఆర్య’ సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. పెళ్లైన తర్వాత నా భార్యను ఒకటే అడిగాను. నాకు ఎన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటాను అని. మా నాన్నంటే అంత ఇష్టం. నేను చూసిన వారిలో ది బెస్ట్ పర్సన్ మా నాన్నే. 45 ఏళ్లుగా ఆయన సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే ఇంతకాలం సౌత్ ఇండియాలో, ఇండియాలో నంబర్ వన్ ప్రొడ్యూసర్గా ఉండలేరు. మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. అలాగే మా నాన్నగారికి కూడా పద్మశ్రీ రావాలనే కోరిక నాకు ఉంది. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండస్ర్టీకి ఎంతో చేసిన ఆయన ఆ అవార్డుకు అర్హుడు’ అని ఎమోషనల్ గా అన్నారు.


