మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే విడుదల ఆలస్యం కావడంతో చిత్రీకరణను వేగవంతం చేశారు రాజమౌళి. అంతేకాదు అభిమానుల కోసం విడుదల తేదీని కూడ ప్రకటించారు. అక్టోబర్ 13వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ ప్రకటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హ్యాపీగా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాత్రం కోపంగా ఉన్నారట.
ఎందుకంటే బోనీ కపూర్ తన నిర్మాణంలో అజయ్ దేవగన్ హీరోగా ‘మైదాన్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు చాలారోజుల క్రితమే ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న వస్తుందని ప్రకటించడంతో రిలీజ్ క్లాష్ ఏర్పడుతుందని బోనీ కపూర్ కలత చెందుతున్నారట. ఎందుకంటే ‘మైదాన్’ చిత్ర, అజయ్ దేవగన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆయన ‘ఆర్ఆర్ఆర్’లో కూడ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ భారీగా రిలీజ్ కానుంది.
అంటే రెండు రోజుల వ్యవధిలో అజయ్ దేవగన్ సినిమాలు రెండు రిలీజ్ అవుతాయన్నమాట. దీని మూలంగా కలెక్షన్లు దెబ్బతింటాయని, అసలే లాక్ డౌన్ మూలంగా నష్టాల్లో ఉంటే ఈ రిలీజ్ పోటీ వలన మరింత నష్టం వాటిల్లుతుందని, రాజమౌళి కాస్త గమనించుకుని వేరొక తేదీని నిర్ణయించుకుని ఉంటే బాగుండేదని అనుకుంటున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ గురించి బోనీ కపూర్ అజయ్ దేవగన్ ద్వారా రాజమౌళితో చర్చలు జరపాలనుకుంటుండగా ఆ ఇన్ఫర్మేషన్ లేని రాజమౌళి తేదీని ప్రకటించేయడంతో ఈ సందిగ్దత ఏర్పడి ఉండవచ్చు.