మాస్ మహారాజా రవితేజ వరుస ప్లాప్ల తర్వాత తన సినిమా బిజినెస్ మోడల్లో మార్పులు చేశాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ షూటింగ్ పూర్తి చేసుకుని, ఆగస్టు 21న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కోసం రవితేజ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని, లాభాల్లో వాటా ప్రాతిపదికన పనిచేశారు.
అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా చేసేందుకు రవితేజ అంగీకరించాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.
దిల్ రాజు పార్ట్నర్గా ఉండి ఇటీవలే వేరుపడిన లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా, రవితేజ త్వరలోనే హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న మరో సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి 2027 నాటికి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
